నేను ఎప్పుడో హీరోగా చేశా: తమన్
- దేవిశ్రీ ప్రసాద్ హీరో కావడంపై తమన్ కు ప్రశ్న
- దేవిశ్రీ ప్రసాద్ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందన్న తమన్
- యాక్టింగ్ చేయడం చాలా కష్టమని వ్యాఖ్య
టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన తోటి సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ హీరోగా మారడంపై చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ‘ఓజీ టూర్’ కాన్సర్ట్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన తమన్... తనదైన శైలిలో పంచ్లు వేస్తూ నెటిజన్లను, అభిమానులను ఎంతగానో నవ్వించారు.
మీడియా ప్రతినిధులు తమన్ను ఉద్దేశించి.. "దేవిశ్రీ ప్రసాద్ హీరో అయ్యాడు. మీరు ఎప్పుడు హీరోగా నటిస్తారు?" అని ప్రశ్నించగా... ఆయన చాలా చాకచక్యంగా, సరదాగా సమాధానమిచ్చారు. "నేను ఎప్పుడో హీరోగా చేసేశాను. ఇప్పుడు దేవి వంతు వచ్చింది, తను హీరో అవుతున్నాడు. అయినా, ఆ విషయాలు మనకెందుకు?" అంటూ నవ్వేశారు. 2003లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'బాయ్స్' సినిమాలో తమన్ ఒక హీరోగా నటించిన సంగతిని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.
నటనకు, సంగీత దర్శకత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని చెప్తూ తమన్ కొన్ని ఫన్నీ కామెంట్స్ చేశారు. "యాక్టింగ్ చేయడం చాలా కష్టం. మండుటెండలో షూటింగ్స్ చేయాల్సి ఉంటుంది. కానీ మ్యూజిక్ డైరెక్టర్గా ఉండటం దేవుడిచ్చిన వరం.. చక్కగా ఏసీ రూమ్లో కూర్చుని మన పని మనం చేసుకోవచ్చు" అని వ్యాఖ్యానించారు.
ఇక దేవి శ్రీ ప్రసాద్ హీరోగా చేయబోయే సినిమాపై తమన్ గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆ సినిమా కచ్చితంగా బ్లాక్బస్టర్ అవుతుందని జోస్యం చెప్పారు. ఈ ప్రాజెక్ట్ గురించి నిర్మాత దిల్ రాజు ఇప్పటికే తనతో చర్చించారని.. అవసరమైతే దేవి సినిమా కోసం తాను రెండు లేదా మూడు పాటలు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నానని తమన్ ప్రకటించారు. "అందరం కలిసికట్టుగా పనిచేస్తేనే మంచి సినిమాలు వస్తాయి" అంటూ తోటి సంగీత దర్శకుడిపై తమన్ చూపించిన ఈ స్నేహపూర్వక మద్దతుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న బాండింగ్ను చూసి ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.